మన ఊరు మన బడి కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు విడుదల చేయకుండా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది? అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. నేడు హైదరాబాదులోని హరీష్ రావు నివాసానికి వచ్చిన మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు తమ గోడు వెల్లబోసుకున్నారు. అప్పులు చేసి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాకపోవడంతో అప్పులు తెచ్చి వడ్డీలు కడుతున్నామని, కుటుంబాలు నడవడం కష్టంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు గారు అసెంబ్లీ వేదికగా మన ఊరు మనబడి కాంట్రాక్టర్ల సమస్యలు లేవనెత్తుతానని వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయాలని, తద్వారా అడ్మిషన్లు పెంచి పేద, మధ్య తరగతి పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని కేసీఆర్ గారు ఆలోచిస్తే, రేవంత్ రెడ్డి ఆ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారని ఈ సందర్భంగా హరీశ్ రావు ఫైరయ్యారు. మన ఊరు మన బడి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే వరకు బిఆర్ఎస్ పోరాడుతుందన్నారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి కి రాష్ట్రంలో విద్య పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదన్నారు. గురుకులాల పిల్లలకు సరిగ్గా అన్నం కూడా పెట్టలేని చేతగాని సర్కారు అని విమర్శించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లను పట్టించుకోకపోవడం, చేసిన పనులకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు.