‘యువగళం’ పాదయాత్రకు మూడేళ్లు:ఎల్లప్పుడూ మీ పక్షాన నిలబడతా:మంత్రి నారా లోకేష్

Spread the love

నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ఏ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లిందో తెలిసిందే. 2024లో కూటమి విజయంలో ఈ పాదయాత్రది కూడా కీలకపాత్ర అని చెప్పుకోవాల్సిందే. కాగా, ఈ పాదయాత్రకు నేటితో మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా లోకేష్ స్పందించారు. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, చేనేత కార్మికులు, వృద్ధులు మరియు అణగారిన వర్గాల కష్టాలను దగ్గరగా చూస్తూ.. నన్ను నేను పునరుద్ధరించుకుంటూ, వారితో మమేకమైన ప్రయాణం ఇది. నాపై ఆశీస్సులు కురిపించిన ప్రతి తల్లికి, ప్రతి సోదరికి నా ధన్యవాదాలు. ఎంతో నిజాయితీతో, ఆశతో మరియు ధైర్యంతో నాతో మాట్లాడిన ప్రతి పౌరునికి నేను కృతజ్ఞుడిని. మీ పోరాటాల నీడలో, మీ ఆకాంక్షల సాక్షిగానే నా రాజకీయం రూపుదిద్దుకుంది.నేను ఈ మాటను పూర్తి నిశ్చయంతో చెబుతున్నాను: మేము రూపొందించే ప్రతి విధానం, తీసుకునే ప్రతి నిర్ణయం.. మీ గొంతుకలను, మీ జీవితాలను తన మూలాల్లో కలిగి ఉంటుంది. మూడేళ్ల ప్రయాణం పూర్తయిన సందర్భంలో, నా ప్రతిజ్ఞను నేను మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను – నేను మీ సైనికుడిగా, మీ పోరాట యోధుడిగా ఉంటూ.. ఎల్లప్పుడూ మీ పక్షాన నిలబడతానంటూ పేర్కొన్నారు.