అన్ని గవర్నమెంటు కార్యక్రమాలు,స్కూల్స్ లో ఇక నుండి జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం పాడాలని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు నేడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త నిబంధలను అమల్లోకి తెచ్చింది. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో అందరూ లేచి నిలబడాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అంతేకాకుండా అన్ని సివిల్ అవార్డ్స్ ఇచ్చే సమయంలో, రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమాల్లో వందేమాతరం ఆలపించాలని పేర్కొంది. ఈ నిబంధనలు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మరియు ఇతర అధికారిక కార్యక్రమాలకు వర్తిస్తాయి. 3 నిమిషాల 10 సెకన్ల నిడివిగల 6 చరణాల వెర్షన్ను మాత్రమే వాడాలి. జాతీయ గీతం, గేయం పాడుతున్నప్పుడు అంతరాయం కలిగించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. కొత్త నిబంధనల కింద బాధ్యులకు గరిష్ఠంగా మూడేళ్ల జైలుశిక్ష విధించనున్నారు. ప్రస్తుతం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాలు నిర్వహించబడుతున్నాయి.1875లో వందేమాతరం గేయాన్ని బంకిం చంద్ర ఛటర్జీ రచించిన సంగతి తెలిసిందే.