విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అద్భుతంగా కొనసాగుతోంది. ఆరు వరుసల్లో 71 వార్ షిప్స్ పరేడ్ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్ఎస్ సుమేధ షిప్ పై రాష్ట్రపతితో పాటు గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం ప్రయాణించారు. రష్యా, ఆస్ట్రేలియా, యూఏఈ తదితర దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ షిప్ లు, ఇండియన్ నేవీకి చెందిన 45 షిప్ లు, కోస్ట్ గార్డ్, మర్చంట్ నేవీ, పరిశోధన షిప్ లు 7 ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి.
ఇక ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇండియన్ నేవీ విశాఖపట్నంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (IFR), మిలాన్ (MILAN) మరియు అయాన్స్ (IONS) కాన్క్లేవ్లకు విచ్చేస్తున్న ప్రపంచ నౌకాదళాలకు ఘన స్వాగతం పలికారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ‘మహాసాగర్’ (MAHASAGAR) విజన్ స్ఫూర్తితో జరుగుతున్న ఈ అంతర్జాతీయ కలయిక, భాగస్వామ్యం, శాంతి మరియు ఉమ్మడి సముద్ర సంపద పట్ల భారత్ కున్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. దేశ చరిత్రలో నిలిచిపోయే ఈ అపురూప ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని పేర్కొన్నారు.