ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో మెజారిటీ రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేస్తూ ప్రధాని మోడీ నాయకత్వంపై, వికసిత భారత్ పట్ల ఆయనకున్న దార్శనికతపై ప్రజలకు ఉన్న నిరంతర మరియు పెరుగుతున్న విశ్వాసాన్ని నేటి ఎన్డీయే విజయం ప్రతిబింబిస్తోందన్నారు. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్’ స్ఫూర్తితో నడుస్తూ, ప్రజల ఆకాంక్షల సంగమంగా ఎన్డీయేను ఇది మరింత బలోపేతం చేసిందని ఈ ఫలితంతో వికసిత భారత్ దిశగా సాగుతున్న ప్రయాణానికి మరింత శక్తి చేకూరిందన్నారు. అభివృద్ధి పట్ల ఎన్డీయేకి ఉన్న అచంచలమైన నిబద్ధతపై ప్రజలకు ఉన్న నమ్మకం, మద్దతు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశ్వసనీయతకు, అభివృద్ధికి మరియు పౌరులతో నిజమైన అనుబంధానికి ‘యువ భారతం’ ప్రాముఖ్యతనిస్తుందని అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఒక సందేశమని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక విజయం సాధించినందుకు ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కి, ఎన్డీయే విజేతలందరికీ, అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలకు మరియు ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.