ఆకివీడు పెదపేటలో ఉన్న శ్రీరాముని ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భక్తులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలయ అభివృద్ధికి భక్తులు తమ వంతు సహకారం అందించవచ్చని తెలిపారు. ఆలయ పునర్నిర్మాణం కోసం విరాళాలు ఇవ్వాలనుకునే భక్తులు కనీసం 100 రూపాయల నుంచి గరిష్టంగా 10 వేల రూపాయల వరకు అందించవచ్చని పేర్కొన్నారు. వీటికి సంబంధించి బ్యాంకు వివరాలను QR కోడ్ ను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పొందుపరిచారు. ఈ విరాళాలను నేరుగా ఆలయ అభివృద్ధి సమితి బ్యాంకు ఖాతాకు జమ చేయవచ్చని సూచించారు. ఇక ఇటీవల శ్రీరామ నవమి రోజున ఆకివీడు పెదపేటలోని రామాలయం వద్ద జరిగిన దాడి, ఈ ఆలయం రామాలయం కాదని కొందరు చేస్తున్న అసత్య ప్రచారం, శ్రీరామ భక్తుల సహకారంతో తలపెట్టిన రామాలయ పునర్నిర్మాణం యొక్క ప్రణాళిక తదితర ముఖ్య అంశాలపై ఇప్పటికే రఘురామ తన స్పందనను వివరించిన సంగతి తెలిసిందే. అక్కడ రామాలయం నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఇప్పుడు భక్తుల భాగస్వామ్యానికి సంబంధించి వివరాలను తెలిపారు.