పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల్లో కలెక్టర్, తహసీల్దార్ లకు వినతిపత్రాలు అందించాలని నిర్ణయించింది. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేసింది. కాగా, జగన్ ప్రభుత్వ హయాంలో పెట్రోల్ రేట్లు పెరిగాయని టీడీపీ చెబుతోంది. పెట్రోల్ విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది. ఆనాటి వైసీపీ బాదుడు మర్చిపోయారా అంటూ తెలుగుదేశం కౌంటర్ వేస్తోంది. గత వైసీపీ పాలనలో రోడ్డు అభివృద్ధి సెస్ పేరిట లీటర్ కి 1 రూపాయి చొప్పున బాదుడుమొదలెట్టింది జగన్ కాదా? అని వైసీపీని ప్రశ్నించింది. పెట్రోలు, డీజిల్ పై 3 సార్లు వ్యాట్ పెంచింది జగన్ కాదా?కరోనా టైమ్ లో మిగతా రాష్ట్రాలన్నీ లీటరుపై రూ.10 వరకు తగ్గిస్తే,పైసా కూడా తగ్గించని జగన్ ఇప్పడు డ్రామాలు ఆడుతున్నాడని మండిపడింది. మొదటి రెండేళ్లలోనే లీటరు పెట్రోల్ పై రూ.41 పెంచిన జగన్ అదే రెండేళ్లలో కూటమి ప్రభుత్వం కేవలం 3 రూపాయలు అది కూడా యుద్ధం కారణంగా పెంచితే డ్రామాలు ఆడుతున్నాడని దుయ్యబట్టింది. ఐదేళ్ల పాలనలో పెట్రోల్ లీటరుకు విడతలుగా పెంచారని అయితే అంతర్జాతీయంగా యుద్ధం వలన దేశవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలతో పెట్రోల్ పై రూ. 3 అదనం అయిందని తెలుగు దేశం వాదిస్తోంది. పెట్రోల్.. డీజిల్ రేట్లు పెరిగిన పాపం నాటి జగన్ పాలన శాపమని చురకలంటించింది. మొత్తానికి పెరిగిన ఇంధన ధరలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి.