కేరళలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణం చేశారు. 20 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. దీంతో సుదీర్ఘ కాలం తరువాత యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూ.డీ.ఎఫ్) అధికారంలోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, మల్లిఖార్జున్ ఖర్గే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రముఖులు హాజరయ్యారు. ఇక కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో కీలక పోస్ట్ చేశారు. కేరళ ప్రజలు ఈ ప్రభుత్వం కోసం పోరాడారు. వారి గొంతే ఈ ప్రభుత్వానికి మార్గదర్శకం అవుతుందన్నారు. ఈ రోజు నుండి ప్రతి కేరళీయుడి గొంతుకగా నిలవబోతున్న వి.డి. సతీశన్ గారికి మరియు మొత్తం మంత్రివర్గానికి హృదయపూర్వక అభినందనలు.ఈ ప్రచారాన్ని ముందుండి నడిపించిన కె.సి. వేణుగోపాల్ కి ధన్యవాదాలు.ఈ విజయం, ఈ ప్రచారంలో అలసిపోకుండా శ్రమించిన కార్యకర్తలకే చెందుతుందన్నారు. అసలైన పని ఇప్పుడే మొదలవుతుందని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే స్పందిస్తూ కేరళలో కొత్త కాంగ్రెస్-యూడీఎఫ్ (UDF) ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, సతీశన్ మరియు మంత్రిమండలి సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కాంగ్రెస్-యూడీఎఫ్ ఉమ్మడి నాయకత్వంలో, కేరళ ఇప్పుడు నిజమైన ప్రగతిని మరియు భవిష్యత్తుకు బాటలు వేసే అభివృద్ధిని చూస్తుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆత్మగౌరవం, న్యాయం, స్వేచ్ఛ, సమగ్రత, సామరస్యాలే తమ నిబద్ధతకు పునాదులుగా నిలుస్తాయన్నారు.