రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. దానికనుగుణంగా కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు. పంచాయతీల పునర్విభజనపైనా న్యాయపరమైన అడ్డంకులు ఏవీ లేవని తెలిపారు. నేడు అసెంబ్లీ పవన్ మాట్లాడారు. ‘స్థానిక సంస్థల స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలను బలోపేతం చేసే చర్యలను తీసుకున్నట్లు తెలిపారు. అలాగే రహదారుల విస్తరణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం చెట్లను తొలగించేటపుడు అక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయం తీసుకురావాలనే దానిపై పరిశీలన జరుపుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ చెట్లను, వృక్షాలను సంరక్షించేలా బలమైన చట్టం తీసుకొచ్చేందుకు ఆలోచిస్తున్నట్లు వివరించారు. ఇది కఠినంగా అమలు చేస్తేనే పచ్చదనానికి భరోసా దొరుకుతుందన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటుతున్నారు తప్పితే.. వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవడం లేదని సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చారని పచ్చదనం సంరక్షణకు సభ్యుల నిశిత దృష్టిని డిప్యూటీ సీఎం అభినందించారు. అదే విధంగా ఇక మీదట అటవీ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసేవాటికి, నాటే ప్రతి మొక్కకు జియో ట్యాగ్ వేసే ప్రక్రియ అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఎర్ర చందనం అమ్మకం విషయంలో మెరుగైన ధరలను పరిశీలించేందుకు, గోదాముల్లో ఉన్న దుంగలను అమ్మకాలను చేసేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని నియమించాం. వారు ఎప్పటికప్పుడు గ్లోబల్ ధరలకు అనుగుణంగా దుంగలకు వేలం నిర్వహిస్తూ ప్రభుత్వ ఖజానాకు మంచి ధరలు వచ్చేలా ప్రయత్నం చేస్తారన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ద్వారా ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఉద్యోగులకు ఇచ్చని 2026-27 ఆర్థిక సంవత్సరాల బడ్జెట్ కు సంబంధించి పవన్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు సంబంధించిన ఆర్థిక ప్రతిపాదనలు, బడ్జెట్ ఆమోదం కోసం నేడు శాసనసభలో పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు చేశారు. పంచాయతీరాజ్ శాఖకు రూ.15,485 కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.11,217 కోట్లు, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు రూ.713 కోట్ల బడ్జెట్ గ్రాంట్ల కోసం ప్రతిపాదనలను సభకు సమర్పించారు.