ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కీలక నగరమైన విశాఖపట్నంలో నేడు గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ కు శంకుస్థాపన జరిగింది. అనంతరం అదానీ గ్రూప్ చైర్పర్సన్ జీత్ అదానీ మాట్లాడారు. 1 గిగావాట్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణం ద్వారా ఏఐ రంగంలో భారత్ ఓ పెద్ద ముందడగు వేసిందన్నారు. కంప్యూట్ రంగంలో ఈ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంతో విశాఖ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ముంబై, చెన్నైలకు పరిమితమైన డేటా సెంటర్ లు ఇక విశాఖలోకి అడుగు పెట్టాయని విశాఖ నగరం ఇక భారత కొత్త డిజిటల్ గేట్ వేగా మారుతుందని పేర్కొన్నారు. భారత్ తో పాటు అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాలకు ఈ ఏఐ డేటా సెంటర్ ద్వారా కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ నేతృత్వంలో డిజిటల్ ఇన్ఫ్రా వేగంగా నిర్మితం అవుతుందని తెలిపారు. విశాఖ నగరం ఏఐ రివల్యూషన్కు నాంది పలికిందని 100 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని అదానీ గ్రూప్ నిర్ణయించిందని తెలిపారు. ఎక్కువ మంది ప్రజలకు, వాణిజ్యానికి, పరిశ్రమలకు ఏఐ సేవలు అందించాలన్నదే తమ ఆలోచన అని పేర్కొన్నారు.