ఉత్తరాంధ్ర పారిశ్రామికాభివృద్ధిలో బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమ ఏర్పాటు మైలురాయి అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెం వద్ద ఇండస్ట్రియల్ పార్క్ లో ప్రముఖ ఫార్మా సంస్థ బ్లూ జెట్ హెల్త్ కేర్యూనిట్ కు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర పారిశ్రామికాభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆధునిక ఫార్మాస్యూటికల్ తయారీలో ఏపీని కీలక గమ్యస్థానంగా మరింత బలపరుస్తోందన్నారు. ఏపీలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మూడు బలమైన కారణాలు ఉన్నాయి. మొదటిది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఒక్కసారి మాతో ఒప్పందం చేసుకున్న తర్వాత అది మీ ప్రాజెక్ట్ కాదు.. మా సొంత ప్రాజెక్ట్ గా భావిస్తాం. ఇన్వెస్టర్లను బయటి వ్యక్తులుగా కాదు, అభివృద్ధి భాగస్వాములుగా చూస్తాం. మాట ఇస్తే నిలబెట్టుకుంటాం. రెండో కారణం.. విశ్వసనీయత, ప్రపంచ పెట్టుబడిదారుల నమ్మకం. మా సీఎం చంద్రబాబు నాయకత్వానికి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత ఉంది. ఆంధ్రప్రదేశ్ మాట ఇస్తే నిలబెట్టుకుంటుంది అని పెట్టుబడిదారులు నమ్ముతున్నారు. అదే మా అతి పెద్ద బలం. మూడోది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని అన్నారు. ప్రకటనలకే పరిమితం కాకుండా పరిశ్రమల గ్రౌండింగ్ కు ప్రాధాన్యత ఇవ్వడమే ఏపీ మోడల్ అని స్పష్టం చేశారు. అతి తక్కువ కాలంలోనే రాంబిల్లి ఇండస్ట్రియల్ పార్క్ ఫేజ్-IIలో 102 ఎకరాలకు పైగా భూమి కేటాయించడం జరిగింది. అవసరమైన అనుమతులు, ఒప్పందాలు వేగంగా పూర్తయ్యాయి. అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. బ్లూ జెట్ ద్వారా రూ.2,300 కోట్ల పెట్టుబడి, 2 వేల మందికి ఉద్యోగాల కల్పన జరగనుంది. ఉత్తరాంధ్రను ఎకనామిక్ హబ్ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.