విజయనగరం జిల్లా, చీపురుపల్లిలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం కార్యక్రమాన్ని ఏపీలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ప్రజా వేదిక సభలో మాట్లాడారు. రాష్ట్రంలో రెండు పవిత్రమైన కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ఒకటి హెచ్పీవీ వ్యాక్సిన్, రెండోది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని సీఎం అన్నారు. దేశంలో హెచ్పీవీ వ్యాక్సిన్ ఉచితంగా వేసేలా ప్రధాని మోదీ ఈ కార్యక్రమం తీసుకువచ్చారన్నారు. వ్యాక్సిన్ కోసం రూ.4 వేలు ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ను ఇస్తోందన్నారు. ప్రాధాన్యత క్రమంలో 14, 15 ఏళ్ల వయసున్న వారందరికీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. 3.45 లక్షల మంది బాలికలు రాష్ట్రంలో ఉన్నారు. విజయనగరం జిల్లాలో 11,985 మంది ఉన్నారు. భారత్ తో పాటు జాంబియా, సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా దేశాల్లో క్యాన్సర్ ఎక్కువగా ఉంటోంది. మన దేశంలో లక్షలో 18 మందికి క్యాన్సర్ సోకుతోంది. క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం మన అలవాట్లు, కలుషిత వాతావరణమని పేర్కొన్నారు. మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ సాధారంగా వస్తోంది. రాబోయే రోజుల్లో క్యాన్సర్ రాకుండా ఉండేందుకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు వివరించారు. సర్వైకల్ క్యాన్సర్ నివారణకు 90 శాతం మంది పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. వ్యాక్సిన్ కు 1648 కోల్డ్ చైన్ పాయింట్స్ పెట్టాం. ఒకసారి డోస్ తీసుకుంటే రక్షణ పొందవచ్చని తెలిపారు. యువిన్ యాప్ ద్వారా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం పర్యవేక్షిస్తోందన్నారు. వ్యాక్సిన్ ఇచ్చాక 30 నిమిషాలు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారు. దీని వల్ల ప్రమాదం ఉండదు. 15 ఏళ్ల వయసున్న బాలికలంతా ఈ వ్యాక్సిన్ వేసుకునేలా బాధ్యత తీసుకోవాలని తల్లితండ్రులకు విజ్ఞప్తి చేశారు. గతంలో పోలియో చుక్కల ద్వారా పోలియో పై విజయం సాధించగలిగామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 1.72 కోట్ల మందికి కాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేశాం. 5.07 లక్షల మందికి నోటి క్యాన్సర్ వచ్చేందుకు ఆస్కారం ఉంది. 2.58 లక్షల మందికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తేలింది. అలాగే 3.40 లక్షల మందికి సర్వైకల్ క్యాన్సర్ అవకాశాలు ఉన్నాయని వీరెవరికీ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు హెచ్పీవీ వ్యాక్సీన్ తో పాటు ఇతర చర్యలూ చేపట్టామన్నారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ సాధించమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఆరోగ్యంగా ఉంటేనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని స్పష్టం చేశారు.