తన సొంత నియోజకవర్గం పిఠాపురం ప్రజలని కలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పట్టణంలో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను ప్రారంభించిన అనంతరం పట్టణంలో కాలినడకన ప్రజల వద్దకు వెళ్లి, వారితో ముచ్చటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. పిఠాపురం ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కాన్వాయ్ నుంచి దిగిన పవన్ అక్కడి నుంచి శ్రీ కుక్కుటేశ్వరస్వామి వారి ఆలయం వరకు ప్రజల్ని పలుకరిస్తూ కాలినడకన ముందుకు సాగారు. అక్కడ తమ సమస్యలను ప్రజలు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. వారి సమస్యను తక్షణం పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ను పవన్ పరిశీలించారు. స్టేషన్ లో ఉన్న గదులను చూసి పిఠాపురంలో శాంతి భద్రతల తీరుపై ఆరా తీశారు. పిఠాపురంలో అభివృద్ధి పండుగ… రూ.211 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పిఠాపురం మండల పరిధిలో రూ.9.60 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ , కోనపాపపేటలో నిర్మించనున్న మల్టీపర్పస్ ఫిషరీస్ సెంటర్, ఉపాధి హామీ పథకం, ఆర్ అండ్ బి నిధులు, సాస్కీ నిధులతో నిర్మించనున్న రోడ్లు, గోకులాలు, వివిధ అభివృద్ధి పనులు ఉన్నాయి.