ఏపీ లోని కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ విమర్శలు గుప్పించారు. ఈమేరకు ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ లో 16 పాయింట్లతో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. జనాభాలో 50 శాతం ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల ముందు మీరిచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు అమలు చేయకపోయినా , అన్నీ చేసేసినట్లు విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, పట్టపగలు ఇంకో డ్రామా మొదలు పెట్టిన మిమ్మల్ని నేరుగా అడుగుతున్నా.. మహిళా సాధికారత అన్న పదం పలికే అర్హత మీకుందా? అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1,500, 50 ఏళ్లకే పింఛన్, బడికి వెళ్లే ప్రతి పిల్ల వాడికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం, సూపర్ సిక్స్లో ఉచిత గ్యాస్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉచిత బస్సులో రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఫ్రీ అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుంటే.. కేవలం ఐదు సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారని ఆక్షేపించారు. తమ చెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చామని అందులో 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించాం. అందులో 10 లక్షల పైచిలుకు ఇళ్లు పూర్తి చేశాం. చంద్రబాబునాయుడు అక్కచెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలాలకు సంబంధించి చేసిన ప్రామిస్ ఏంటి? పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామనిమేనిఫెస్టోలో చెప్పారు. 3 బడ్జెట్లు అయిపోయాయి. ఈరోజుకు కూడా ఒక్క కుటుంబానికి ఒక్క పట్టా ఇవ్వలేదు. ఒక్క గజం కూడా స్థలం దీనికోసం కొనలేదు. ఉన్న ఇళ్లనిర్మాణాలను గాలికొదిలేశారు. మరి ఆ ఇళ్ల నిర్మాణాలను అక్కచెల్లెమ్మలకు ఎప్పుడు పూర్తి చేసి ఇస్తారు? అని ప్రశ్నించారు. ఇక డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ, ఈబీసీ నేస్తం పథకాల గురించి ప్రశ్నించారు. దిశ పోలీస్ స్టేషన్లను, దిశ యాప్ ను కూడా నిర్వీర్యం చేశారని విమర్శించారు. వైసీపీ పాలనలో దాదాపు 90 శాతం అక్కచెల్లెమ్మల పేరిట డీబీటీ పథకాలేనని తాము ఇచ్చిన ఇళ్ల స్థలాలన్నీ అక్కచెల్లెమ్మల పేరుమీదే! దేశ చరిత్రలో తొలిసారిగా.. మేం ఇచ్చిన వేల కొద్దీ నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వాటా నేరుగా అక్కచెల్లెమ్మలకే! అని జగన్ పేర్కొన్నారు. చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఎక్కువ మంది మహిళలకు ఎమ్మెల్సీలు, క్యాబినెట్ మంత్రులుగా అవకాశం ఇచ్చినది కూడా మా అయిదేళ్ల పాలనలోనే! ఇలా చేశాం కాబట్టే మా పాలన మహిళా సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయం అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మన ఆడ బిడ్డలు, తమ కుటుంబాల చరిత్రనే కాకుండా.. ఈ దేశ చరిత్రనే మార్చేలా శక్తిమంతంగా ఎదిగేలా వారికి అండగా నిలిచామని జగన్ తెలిపారు.