రాష్ట్ర సమాచార కమిషన్ కు ప్రధాన కమిషనర్ సహా నాలుగు కమిషనర్ల నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ప్రధాన సమాచార కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు, కమిషనర్లుగా పరవాడ సింహాచలం నాయుడు, వొంటేరు రవిబాబు, గాజుల ఆదెన్న, వట్టికూటి శరత్ చంద్ర కల్యాణ చక్రవర్తిలను నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్గా నియమితులైన వజ్జా శ్రీనివాసరావు హైకోర్టు న్యాయవాదిగా ఉన్నారు. కమిషనర్ గా నియమితులైన పరవాడ సింహాచలం నాయుడు విశాఖపట్నం ప్రధాన జిల్లా కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా బాధ్యతలు నిర్వహించారు. కడప నగరానికి చెందిన వొంటేరు రవిబాబు 1994 నుంచి హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన గాజుల ఆదెన్న ఇంతకుముందు పొల్యూషన్ కంట్రోల్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. అనంతపురం నగరపాలక సంస్థ, అర్బన్ బ్యాంక్లకు న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. పలు ప్రైవేటు సంస్థలకు కూడా న్యాయ సలహాదారుగా పనిచేశారు.వట్టికూటి శరత్ చంద్ర కల్యాణ చక్రవర్తి తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలుకు చెందినవారు. వీరు మూడేళ్ల కాలం లేదా వారి వయస్సు 65 ఏళ్లు పూర్తయ్యేదాకా (ఏది ముందైతే అది) పదవిలో కొనసాగుతారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వుల్లో తెలిపారు.