కల్తీ నెయ్యి కేసులో పీకల్లోతు కూరుకుపోయిన వైసీపీ, హెరిటేజ్ కంపెనీపై ఆరోపణలు చేయడం దుర్మార్గమని టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు అన్నారు. హెరిటేజ్ ఎప్పుడూ టీటీడీకి నెయ్యి సరఫరా చెయ్యలేదు. ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగా కానీ నెయ్యి సరఫరాలో హెరిటేజ్ పాత్ర లేదని అబద్ధాన్ని పదే పదే చెబితే అది నిజమవుతుందనుకోవడం మీ భ్రమ అని వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. హెరిటేజ్ కంపెనీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదనేది నిప్పులాంటి నిజం.మండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న బొత్స సత్యనారాయణ గారు విషయాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. హెరిటేజ్ చీజ్ ప్యాకెట్టు చూయించి నెయ్యి అని చెప్పి మీ పరువు పోగొట్టుకున్నారు. వై.ఎస్.జగన్ చెప్పినట్లు ఆడకుండా మాట్లాడే ముందు విజ్ఞతతో ఆలోచించాలని హితవు పలికారు. నెయ్యి ధరలపైనా వైసీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఓపెన్ టెండర్లలో పారదర్శకంగా వీటిని నిర్ణయించినట్లు తెలిపారు. మా పాలకవర్గం రాగానే మొదటగా మేము స్వామి వారి అన్న ప్రసాదాల నాణ్యతలో రాజీపడకూదని నిర్ణయించుకున్నాం. తక్కువ ధరలకు సరుకులు కొని స్వామి వారికి నాణ్యత లేని నైవేద్యాలు, భక్తులకు అన్న ప్రసాదాలు అందించడం ఏంటి? అని ప్రశ్నించారు.ఈ విషయంలో మేం రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నెయ్యి ఒక్కటే కాదు అన్ని రకాల పదార్ధాల్లోను నాణ్యతా ప్రమాణాలు పెంచినట్లు తెలిపారు.