ఒక నాయకుడు చేసిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రను తిరగరాయగలదని నిరూపించింది నాడు తన తండ్రి వై.ఎస్. చేపట్టిన పాదయాత్ర అని మాజీ సీఎం వై.ఎస్.జగన్ అన్నారు. ఈమేరకు జగన్ నేడు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. నాకు బాగా గుర్తు ఏప్రిల్ 9, 2003లో ఎర్రటి ఎండలో ప్రజల కష్టాల్లో పాలుపంచుకునేందుకు నాన్న చేపట్టిన ఆ పాదయాత్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపింది. నేనున్నాననే భరోసా ఇచ్చింది. నాన్నకు రాష్ట్రం మొత్తం మద్దతుగా నిలిచి సీఎంని చేసింది. నాన్న సీఎం కాగానే ఉచిత విద్యుత్ ఫైల్పై తొలి సంతకం చేసిన దగ్గరి నుంచి ఆయన తీసుకు వచ్చిన ఎన్నో సంస్కరణలు, పథకాలు రాష్ట్ర రూపు రేఖలు మార్చేశాయని జగన్ పేర్కొన్నారు. రైతును రాజుగా నిలిపాయి. అక్కచెల్లెమ్మలు వారి సొంత కాళ్లపై నిలబడేలా చేశాయి. బడుగు, బలహీన వర్గాలకు బతుకుపై భరోసానిచ్చాయి. ఎంతో మంది పేద పిల్లలు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, కలెక్టర్లుగా అయ్యేలా చేశాయన్నారు. ఎన్నో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో నాన్న వేసిన ఆ ముద్రను ఎవరూ చెరిపేయలేనిదని గుర్తు చేసుకున్నారు. నాన్న చేపట్టిన పాదయాత్ర నేటికి 23 ఏళ్లు అయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ నా ఈ ప్రయాణం కొనసాగుతుందని జగన్ పేర్కొన్నారు.