నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలిపారు. వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. AI సాంకేతికతను వాడుకుని తన రూపం అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనది, వక్రీకరించినది.. ఇది టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకమని ఆయన తెలియజేశారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది. వైసీపీ కి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దీనిపై తాను చట్ట ప్రకారం ముందుకెళ్తానని స్పష్టం చేశారు. తనపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్ర ను తేల్చాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలేది లేదని బీ.ఆర్.నాయుడు హెచ్చరించారు.