అన్నారం బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్ చేసిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కే.టీ.ఆర్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు, అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా ?? అని ప్రశ్నించారు. నిబంధనలకు పాతరేసి ఏకంగా బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు.. అతిపెద్ద నేరమని మండిపడ్డారు. ఈమేరకు అందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఏకంగా బ్యారేజీని బలహీనపరిచి బీఆర్ఎస్ పై బురదజల్లే పన్నాగాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేస్తున్న అరాచకపర్వాన్ని అన్నదాతలు క్షమించే ప్రసక్తే లేదని విమర్శించారు. నిబంధనలు తుంగలో తొక్కి అన్నారం బ్యారేజి పిల్లర్ల వద్ద ఇసుక తవ్వకాలు చేసి బ్యారేజీని రేవంత్ సర్కార్ ప్రమాదంలోకి నెడుతుందని ఆక్షేపించారు. ఇది ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే కుట్రేనని మండిపడ్డారు. తెలంగాణ వనరులను కాంగ్రెస్ పార్టీ ఎలా కొల్లగొడుతుందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదని పేర్కొన్నారు. కాళేశ్వరం బ్యారేజీలకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు.