శ్రీకాకుళం జిల్లా చరిత్రలో 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా శ్రీకాకుళం నుండి తిరుపతికి నేరుగా రెగ్యులర్ రైలు సర్వీస్ ప్రారంభం కావడం పట్ల ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది గర్వకారణమని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పథంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. దీంతో ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడిందన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం 17439/40 హంసఫర్ ఎక్స్ప్రెస్ ప్రతి ఆదివారం తిరుపతి నుండి, ప్రతి సోమవారం శ్రీకాకుళం నుండి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 13న శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుండి ఈ రైలు సర్వీసును ఘనంగా ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను గుర్తించి, ప్రత్యేక చొరవ చూపి రైల్వే శాఖతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఈ రైలు సర్వీసు మంజూరులో కీలక పాత్ర పోషించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు అభినందనలు తెలిపారు. అలాగే ఈ అభ్యర్థనను మన్నించి ఈ సౌకర్యాన్ని కల్పించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలిపారు.