మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో టిప్పర్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న దుర్ఘటనపై ఏపీ మాజీ సీఎం వై.ఎస్. జగన్ స్పందించారు. ఈ దుర్ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం మనసును కలిచివేసిందన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు వెంటనే తగిన ఆర్థిక సహాయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.