పేదరిక నిర్మూలనలో భాగంగా చేపట్టిన P4 వార్షికోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 1.06 లక్షల మంది మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, 10.97 లక్షల మంది బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని చేయూతను అందిస్తున్నారు. మంచి ఆలోచనతో చేపట్టిన ఈ కార్యక్రమంలో 2 లక్షల కుటుంబాలకు సాయం అంది, వారి జీవితాల్లో వచ్చిన మార్పులు ఎంతో సంతృప్తిని కలిగించాయని చంద్రబాబు అన్నారు. మనకున్న దాంట్లో కొంత సమాజానికి తిరిగి ఇవ్వడంలో ఉండే తృప్తి, సంతృప్తి ఎక్కడా లభించదన్నారు. మార్గదర్శులుగా ముందుకొచ్చిన వారందరికీ బంగారు కుటుంబాల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమమే ఈ P4 (Public-Private-People Partnership) మోడల్. సీఎం చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’లో భాగంగా, 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం (Zero Poverty) లక్ష్యంగా దీనిని ప్రారంభించారు. గతేడాది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.