ఉమ్మడి తెలుగు రాష్ట్రం కోసం ఉద్యమించి తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి భాషా ప్రయుక్తరాష్ట్రాలకు బాటలు వేసిన ధీశాలి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆంధ్రులు ఆయన త్యాగాలను స్మరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయనకు ఘననివాళి అర్పిస్తున్నాను. ఆ మహనీయుని త్యాగం ఈనాటికీ మనకు స్పూర్తి. మహాత్మ గాంధీజీ అడుగుజాడల్లో నడచి దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాలుపంచుకున్న ఆయన జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం, ముఖ్యంగా తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారు. ఆ అమరజీవిని స్మరించుకుంటూ ఘననివాళి అర్పిద్దాం! అంటూ పిలుపునిచ్చారు.