ఈ రోజు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ & నిప్పన్ స్టీల్స్ భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సంస్థ ప్రతినిధులు, కేంద్రమంత్రి కుమారస్వామి రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఇప్పడు చేస్తున్నది కేవలం భూమిపూజ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది విశ్వాసం, నమ్మకంతో కూడిన ఒక ప్రకటన అని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రజా ప్రభుత్వం చెప్పింది చేయగలదని ప్రపంచానికి చాటిచెప్పే ప్రకటనని పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే చంద్రబాబు వంటి రాజకీయ దురంధరులు ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దార్శనికత ఉన్న, విలువలు ఉన్న రాజకీయ నాయకుడని కొనియాడారు. చంద్రబాబు గారి విజన్, సపోర్ట్తో ఈ రోజు మేము ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయగలుగుతున్నాం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం చంద్రబాబు గారు చూపుతున్న కమిట్మెంట్, పారిశ్రామికవేత్తల్లో విశ్వాసాన్ని నింపేలా ఏపీలో విధానాలు ఉన్నాయని ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ ఎన్ మిట్టల్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఏంటో ఈ దేశం చూస్తుంది..ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం స్పష్టంగా కనిపించింది. స్పష్టమైన విధానాలు ఉంటే ఎంత వేగంగా పనులు సాకారం అవుతాయో ఏపీ నిరూపించింది. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు ఏపీపై ఉన్న నమ్మకానికి ఈ పరిశ్రమ అతిపెద్ద ఉదాహరణని ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ చైర్మన్ ఆదిత్య మిట్టల్ పేర్కొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ 20 నెలల్లోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఆర్సెలార్ మిట్టల్- నిప్పాన్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటును సాకారం చేసి చూపించామని పేర్కొన్నారు. ఈ భారీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు సాకారం కావటంలో కృషి చేసిన ఆదిత్య మిట్టల్, మంత్రి నారా లోకేష్ను అభినందించారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం భూమిని ఇచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు తెలిపారు.