ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడంలో 25.3%తో ముందంజలో దూసుకుపోతున్నట్లు ప్రఖ్యాత ‘ఫోర్బ్స్’ లో వచ్చిన వార్తపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త మరియు ఈ ఏడాదికి లభించిన ఒక మంచి ఆరంభమని పేర్కొన్నారు. మన ముందుచూపుతో కూడిన విధానపరమైన సంస్కరణల ప్రభావాన్ని ఇది ప్రతిబింబిస్తుందన్నారు. ముఖ్యంగా ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ చొరవతో , ప్రోత్సాహకాల పంపిణీని సకాలంలో మరియు పారదర్శకంగా చేపట్టేందుకు ప్రవేశపెట్టిన ‘ఎస్క్రో ఆధారిత విధానం’ (Escrow-based mechanism), అలాగే స్పష్టమైన రంగాల వారీ విధానాలు ఈ విజయానికి దోహదపడ్డాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను తమ అభివృద్ధి గమ్యస్థానంగా ఎంచుకుని, మన దార్శనికతపై నమ్మకం ఉంచిన పెట్టుబడిదారులకు ఈ సందర్భంగా చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం యొక్క నిబద్ధతను మరియు కృషినీ అభినందించారు. ఈ మైలురాయి ఒక ముగింపు కాదు, ఇది నిరంతర పురోగతికి ఒక పునాది మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం ఇదే స్థాయిలో తమ ప్రయత్నాలను మరింత విస్తరించడం, భాగస్వామ్యాలను బలోపేతం చేయడం మరియు స్థిరమైన వృద్ధిని అందించడంపైనే దృష్టి సారించనున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.