తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీయేట్ ఎడ్యుకేషన్ నిర్వహించిన పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఎన్టీఆర్ మహిళా జూనియర్, డిగ్రీ కాలేజ్ విద్యార్ధులకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. అన్ని విభాగాల నుండి పదుల సంఖ్యలో విద్యార్ధులు అత్యధిక మార్కులు, టాప్ ర్యాంకులతో ప్రతిభ కనబరచడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సీనియర్ ఎంపీసీ నుండి 2, 3 రాష్ట్ర ర్యాంకులతో పాటు జూనియర్ ఎంపీసీలో 10 మంది విద్యార్ధులు, జూనియర్ బైపీసీలో 11 మంది విద్యార్ధులకు ఉత్తమ ర్యాంకులు వచ్చాయని తెలిపారు. అలాగే జూనియర్ ఎంఈసీలో 3, 4 ర్యాంకులు, జూనియర్ సీఈసీలో 5వ ర్యాంకు ఎన్టీఆర్ మహిళా జూనియర్, డిగ్రీ కాలేజ్ విద్యార్ధులకు రావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తున్న అత్యున్నత సేవలకు దక్కిన ఫలితం ఇది అని కొనియాడారు. దీనికి కారణమైన ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వాహకులకు, కళాశాల బోధనా సిబ్బందికి, ఉద్యోగులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. ఇదే ఉత్సాహం, ఇదే సేవా స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు.