స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెంచిన ఈ కొత్త ఛార్జీలు 2025 డిసెంబర్ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మార్పుల ప్రభావం ప్రధానంగా సేవింగ్స్, శాలరీ ఖాతాదారులపై పడనుంది.ఇక కొత్తగా సవరించిన రూల్స్ ప్రకారం ఎస్బీఐ ఖాతాదారులు ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత ఇతర బ్యాంకుల ఏటీఎంలలో చేసే క్యాష్ విత్డ్రాయల్ పై ఇకపై రూ. 23తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ ఛార్జీ రూ. 21 జీఎస్టీ అదనంగా ఉండేది. అలాగే, బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్మెంట్ వంటి నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సక్షన్ పై ఛార్జీని రూ. 10 నుంచి రూ. 11కి (జీఎస్టీ అదనం) పెంచారు. సేవింగ్స్ అకౌంట్ హోల్డర్ కు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 5 ఫ్రీ లిమిట్ ట్రాన్సక్షన్ పరిమితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ముఖ్యంగా శాలరీ ప్యాకేజీ ఖాతాదారుల విషయంలో ఎస్బీఐ కీలక మార్పులు చేసింది. గతంలో వీరికి ఏ ఏటీఎంలోనైనా అన్ లిమిటెడ్ ఉచిత లావాదేవీల సౌకర్యం ఉండగా, ఇప్పుడు దానిని నెలకు 10కి లిమిట్ చేసింది. ఈ 10 ట్రాన్సక్షన్లు దాటిన తర్వాత చేసే ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కు రూ. 23, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కు రూ. 11 తో పాటు జీఎస్టీ అదనంగా చెల్లించాలి. అయితే, కొన్ని ఖాతాలపై ఈ పెంపు ప్రభావం ఉండదని తెలిపింది. ఎస్.బీ.ఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాల సర్వీస్ ఛార్జీలలో ఎలాంటి మార్పులు లేవు. అలాగే, ఎస్బీఐ డెబిట్ కార్డుతో ఎస్బీఐ ఏటీఎంలలో చేసే లావాదేవీలపై ఛార్జీలు యథాతథంగా ఉంటాయి. కార్డు లేకుండా చేసే క్యాష్ విత్డ్రాయల్స్ పైనా కొత్త ఛార్జీలు వర్తించవు.