నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ అనగానే అభిమానులకు గుర్తుకొచ్చేది ఒకటే… పక్కా మాస్ జాతర! వీరిద్దరి కలయికలో వచ్చిన వీర సింహా రెడ్డి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది అన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత మళ్లీ ఈ కాంబోలో మరో చిత్రం రాబోతుండటంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి వస్తున్న ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తోంది. అఖండ 2 సినిమా తరవాత బాలయ్య చేస్తున్న సినిమా కాబట్టి మల్లి బాలయ్య బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్పై ఒక కీలక సమాచారం బయటకు వచ్చింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రెగ్యులర్ షూటింగ్ మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది అంట. హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మొదటి రోజే బాలయ్య మార్క్ పవర్ఫుల్ యాక్షన్ సీన్తో చిత్రీకరణను ప్రారంభించాలని దర్శకుడు గోపీచంద్ మలినేని ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు పండగలా ఉండేలా తీర్చిదిద్దుతున్నారట. హీరోను వెండితెరపై శక్తివంతంగా చూపించడంలో గోపీచంద్ మలినేనికి ప్రత్యేకమైన శైలి ఉంది. గతంలో బాలయ్యను ఆయన చూపించిన తీరు అభిమానులను ఉర్రూతలూగించింది. ఇప్పుడు ఆ అనుభవాన్ని మరింతగా పెంచి, ఇంకా పెద్ద స్థాయిలో బాలకృష్ణను చూపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో మంచి ఫామ్లో ఉన్నారు. ఆయన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, యాక్షన్ స్టైల్ అన్ని కలిసి థియేటర్లలో ప్రత్యేకమైన మాస్ ఫీలింగ్ తీసుకొస్తాయి. ఈసారి కూడా అదే స్థాయిలో, ఇంకా ఎక్కువ ఊరమాస్ ఎలిమెంట్స్తో కథ సిద్ధమైందని సినీ వర్గాలు చెబుతున్నాయి. పక్కా కమర్షియల్ హంగులతో, అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలతో స్క్రిప్ట్ రూపొందించారట.
ఈ సినిమాలో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి జంటకు ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. గతంలో వచ్చిన “సింహా”, “శ్రీరామరాజ్యం”, “జై సింహా” వంటి చిత్రాల్లో ఈ జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరోసారి ఈ హిట్ పెయిర్ తెరపై కనిపించనుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇంకా ఈ చిత్రంలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం మాత్రం టాలీవుడ్లో ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్గా మారింది. గోపీచంద్ మలినేని టేకింగ్, బాలయ్య ఎనర్జీ కలిస్తే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. యాక్షన్ ప్రేమికులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని టాక్. మొత్తానికి, బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబో మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేయడానికి రెడీ అవుతోంది.