తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్ భేటీ

Spread the love

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అడోబ్ సీఈఓ మరియు ‘తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ బోర్డ్’ సభ్యులు శాంతను నారాయణ్ సమావేశమయ్యారు. ఈ భేటీలో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ధోరణులు, గ్రీన్ ఎనర్జీ, ఉపాధిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం మరియు యువతకు నైపుణ్య శిక్షణ వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వేగంగా మారుతున్న ప్రపంచ పరిస్థితులు, వివిధ రంగాల్లో ఎదుగుతున్న అవకాశాల గురించి ఇరువురూ చర్చించారు. ప్రపంచ స్థాయిలో తెలంగాణ పోటీ పడాలంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. తెలంగాణను ఒక అగ్రగామి తయారీ కేంద్రంగా మార్చడానికి, ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలను రాష్ట్రానికి ఆకర్షించడానికి సమగ్ర వ్యూహాలు రూపొందించాల్సిన అవసరాన్ని సీఎం రేవంత్ నొక్కి చెప్పారు. దీని కోసం పాలసీలు, మౌలిక సదుపాయాలు మరియు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌లను బలోపేతం చేయడంపై చర్చించారు. AIతో వస్తున్న విప్లవాత్మక మార్పులు, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం మరియు AIని సామాన్యుల వృద్ధికి ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలపై లోతుగా చర్చించారు. భవిష్యత్తులో ఉద్యోగ సవాళ్లను ఎదుర్కొనేలా యువతను సన్నద్ధం  చేయడానికి శక్తివంతమైన ‘స్కిల్లింగ్ మరియు రీ-స్కిల్లింగ్’ కార్యక్రమాల ప్రాముఖ్యతను సీఎం రేవంత్ వివరించారు. కేవలం సాంకేతిక రంగమే కాకుండా.. తయారీ, గ్రీన్ ఎనర్జీ వంటి వ్యూహాత్మక రంగాలలో తెలంగాణ అభివృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేయడంలో శాంతను నారాయణ్ గారి సహకారం మరియు మార్గదర్శకత్వాన్నిఈ సందర్భంగా  కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *