కన్నడ స్టార్ హీరో ‘యష్’ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్’పై మొదటి రోజు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యష్, ఇప్పుడు మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాను మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ని ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఎప్పుడో ఏడాది కిందట ప్రకటించారు నిర్మాతలు. అందుకు తగ్గట్టే ప్రమోషన్స్ను జెట్ స్పీడ్లో ముందుకు తీసుకెళ్లారు మేకర్స్. పోస్టర్లు, గ్లింప్స్, అప్డేట్లు అన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. యష్ లుక్, సినిమా కాన్సెప్ట్పై అభిమానుల్లో మంచి ఆసక్తి పెరిగింది. అయితే అనుకోని పరిణామాలు ఇప్పుడు ఈ సినిమాకు అడ్డంకిగా మారాయి. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులు మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా విస్తరించాయి. దుబాయ్, అబుదాబి, కువైట్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ ప్రాంతాలు భారతీయ సినిమాలకు చాలా పెద్ద మార్కెట్. ముఖ్యంగా యష్ వంటి పాన్ ఇండియా స్టార్ సినిమాలకు గల్ఫ్ మార్కెట్ కీలకం. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల కారణంగా అక్కడ థియేటర్ల వ్యవస్థ, విడుదల ప్రణాళికలపై అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితులను గమనించి ‘టాక్సిక్’ విడుదలను వాయిదా వేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన తేదీకి బదులుగా సినిమా విడుదలను రెండు నెలలు తరవాత అంటే జూన్ 4న రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.