రెండోసారి అమెరికన్ ప్రెసిడెంట్ గా పదవీ బాధ్యతలు తీసుకున్న అనంతరం ట్రంప్ వ్యవహార శైలిపై ప్రపంచ దేశాలు అంత సంతృప్తిగా లేవన్న సంగతి తెలిసిందే. కాగా, కార్నెగి ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ విడుదల చేసిన ‘2026 ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్ సర్వే’లో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ట్రంప్ విధానాలపై భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను నిర్వహిస్తున్న తీరును 55 శాతం మంది ఇండియన్ అమెరికన్లు వ్యతిరేకించారు. కేవలం 20 శాతం మంది మాత్రమే ఆయన విధానాలను సమర్థించారు. 25 శాతం మంది ఎటువంటి అభిప్రాయం చెప్పలేదు. వాణిజ్యం, వ్యూహాత్మక సహకారంలో తలెత్తిన విభేదాలు ‘క్వాడ్’ (Quad) కూటమి లక్ష్యాలను దెబ్బతీశాయని సర్వేలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. యూగవ్ భాగస్వామ్యంతో నవంబర్ 25, 2025 నుండి జనవరి 6, 2026 మధ్య ఈ సర్వే నిర్వహించారు. ఇందులో వెయ్యి మంది భారతీయ సంతతి అమెరికన్లు పాల్గొన్నారు. మొత్తానికి, ట్రంప్ ప్రభుత్వ ఆర్థిక మరియు విదేశీ విధానాలు భారత్-అమెరికా సంబంధాలను దెబ్బతీస్తున్నాయని మెజారిటీ ఇండియన్ అమెరికన్లు భావిస్తున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.