అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో యుద్ధం మరికొన్ని వారాల పాటు జరిగే అవకాశం ఉందన్నారు. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పూర్తిస్థాయిలో కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఈసందర్భంగా తనపై గతంలో జరిగిన హత్యాయత్నాల సంఘటనల గురించి కూడా మాట్లాడారు. ఖమేనీ ప్రోద్బలంతోనే తనపై రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయన్నారు. ఇరాన్ పై ఆపరేషన్ నాలుగు నుంచి ఐదు వారాలు జరగొచ్చు. వార్ సివియారిటీ ఇదేవిధంగా కొనసాగించడం ఇజ్రాయెల్, అమెరికాకు కష్టమేమీ కాదన్నారు. మరోవైపు, చర్చల కోసం తమ దారులు ఇప్పటికీ తెరిచే ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే, చర్చలు జరుగుతాయో, లేదో చెప్పలేమని ట్రంప్ వెల్లడించారు. ఇక ఈ ఆపరేషన్లో ఇప్పటివరకు అమెరికాకు చెందిన ముగ్గురు సైనికులు మరణించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ తమ సైనికుల మరణానికి బదులు తీర్చుకుంటామన్నారు. ఇక ఖమేనీతో పాటు పలువురు సీనియర్ మిలిటరీ కమాండర్లు, రాజకీయ ప్రముఖులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇరాన్ ఐఆర్ జీసీ, మిలిటరీ ఫోర్సెస్ ఆయుధాలు వీడితే వారికి రక్షణ కల్పిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. లేదంటే వారికి చావు తప్పదని హెచ్చరించారు. తను ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ పొందాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన, భయంకరమైన మిలిటరీ దాడులను చూస్తున్నామని అమెరికా ప్రెసిడెంట్ తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండటం అమెరికా సెక్యూరిటీకి హానికరమని పేర్కొన్నారు. దాన్ని అడ్డుకోవడమే కోసమే తాము ఈ దాడులు చేపట్టినట్లు తెలిపారు. తమ టార్గెట్స్ పూర్తయ్యే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.