ప్రయాగ్ రాజ్ లో గతేడాది జరిగిన మహాకుంభమేళాలో పూలదండలు అమ్ముతూ ఓవర్ నైట్ సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న యువతి మోనాలిసా భోంస్లే తన పెళ్లిపై వస్తున్న వదంతులను కొట్టిపారేశారు. తాను ఫర్మాన్ ఖాన్ ను హిందూ సంప్రదాయాల ప్రకారమే పెళ్లి చేసుకున్నానని, దీనికి ‘లవ్ జిహాద్’ ను ఆపాదించడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. పెళ్లి తరువాత నేడు కేరళలో తన భర్తతో కలిసి ఆమె మొదటి సారిగా మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన పెళ్లి హిందూ ఆచారాల ప్రకారం జరిగిందని ఇది లవ్ జిహాద్ కాదని స్పష్టం చేశారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని ప్రతీ మతాన్ని సమానంగా చూస్తానని తెలిపారు. తామిద్దరూ తమ తమ మతాలను మార్చుకోలేదని ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ కూడా తెలిపారు. ఇక మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మోనాలిసా, ప్రయాగ్రాజ్ లో జరిగిన మహాకుంభమేళాలో పూలు, గాజులు అమ్ముతున్న వీడియోలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. దీంతో దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెను గుర్తించి ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ అనే చిత్రంలో నటిగా అవకాశం ఇచ్చారు. ఇక నటనపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల మోనాలిసా వ్యక్తిగత జీవితంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇటీవల కేరళలోని తంపనూర్ పోలీస్ స్టేషన్ లో ఆమె రక్షణ కోరుతూ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె వివాహం చేసుకోవడం వార్తల్లో నిలిచింది.