లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఓటింగ్ లో మూజువాణీ ఓటుతో ఈ తీర్మానం తిరస్కరించబడింది. రెండు రోజుల చర్చల అనంతరం నిర్వహించిన ఓటింగ్ లో ఈమేరకు తిరస్కరించారు. రెండు రోజుల చర్చకు అమిత్ సమాధానమిస్తూ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. స్పీకర్ చిత్తశుద్ధినే శంకిస్తారా అని మండిపడ్డారు. స్పీకర్ నిబద్ధతను ప్రశ్నించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. సభ కొన్ని నియమాలపై ఆధారపడి నడుస్తుందే తప్ప ఏ పార్టీయో రూపొందించేవాటిపై కాదని ఆక్షేపించారు. నాలుగు దశాబ్దాల తర్వాత స్పీకర్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టడం చిన్నవిషయమేమీ కాదని స్పీకర్ ను శంకించే విధంగా విపక్షాలు వ్యవహరించడం దురదృష్టకరమని గతంలో బీజేపీ సుదీర్ఘకాలం విపక్షంలో ఉన్నా ఏనాడూ ఏ స్పీకర్ పైన ఇలాంటి తీర్మానం తీసుకురాలేదని గుర్తు చేశారు. రాహుల్ ను సభలో మాట్లాడనివ్వడం లేదనేది వాస్తవం కాదని కీలక సమావేశాల సమయంలో ఆయన విదేశాలకు వెళ్లిపోతుంటారని విమర్శించారు. 17వ లోక్ సభలో ఆయన హాజరు 51 శాతమే అంటూ పలు గణాంకాలను, రాహుల్ పర్యటించిన దేశాల పేర్లను వివరించారు. లోక్ సభలో బీజేపీ కంటే కాంగ్రెస్ ఆరు రెట్ల అధిక సమయం లభించిందన్నారు. ఆయన స్పీచ్ చివర్లో విపక్షాలు వెల్ వద్దకు వెళ్లి నిరసనలు తెలిపాయి.