అమెజాన్ ఎయిర్ తొలి కార్గో విమానాన్ని నేడు ఢిల్లీ నుండి గౌహతి వరకు కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. దీని ద్వారా ఈశాన్య ప్రాంతాలకు ఎయిర్ కార్గో కనెక్టివిటీ మరింత బలపడుతుందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ ప్రత్యేక ఎయిర్ కార్గో సేవల వల్ల సరుకు రవాణా సమయం గణనీయంగా తగ్గి, ఈశాన్య ప్రాంతంలోని రైతులు, కళాకారులు, వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు సులభంగా చేరవేయగలుగుతారని తెలిపారు. గౌహతికి అమెజాన్ ఎయిర్ కార్గో సేవలు ప్రారంభం కావడం, అసోం రాష్ట్రంలో సీఎం హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో వ్యాపార అవకాశాలు మరియు ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్నదానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇది ప్రధాని మోడీ “Act East, Act Fast, Act First” దూరదృష్టి ఫలితమేనని ఈ దిశగా ఈశాన్య ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. నేడు, ఈశాన్య ప్రాంతంలోని ప్రతి రాష్ట్రంలో ఎయిర్ పోర్టు కార్యకలాపాలు జరుగుతున్నాయని 2014లో ఉన్న 9 ఎయిర్ పోర్టులు ఇప్పుడు 16కి పెరిగాయన్నారు. అలాగే స్థానిక తోటల ఉత్పత్తులు, త్వరగా పాడయ్యే వస్తువులు విస్తృత మార్కెట్లకు చేరుకునేలా ఎయిర్ కార్గో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తూ “Vocal for Local” దార్శనికతను ముందుకు తీసుకెళ్తున్నట్లు కేంద్రమంత్రి వివరించారు.