ఇటీవల దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి నిరసనలు తెలపడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. వారి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ వేదికలపై ఇటువంటి ఘటనలు ఉపేక్షించదగినవి కాదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. నిరసనల గురించి ఉదయ్ భానును పోలీసులు సుదీర్ఘ సమయం విచారించినట్లు తెలుస్తోంది. అనంతరం అతనిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.నిరసనలకు సంబంధించి ఆయన కీలక పాత్ర పోషించారని ఆధారాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ తరువాత అతడిని ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు, ఈ అరెస్ట్పై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కేంద్రం కాలరాస్తోందని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ యువ నేతను వేధిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.