10 సంవత్సరాలకు ఒకసారి దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన జన గణన 2021లో చేయాల్సింది. అయితే అప్పుడు కోవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిని చేపట్టాలని భావిస్తున్న కేంద్రం ఈ ప్రక్రియను రెండు విడతల్లో చేసేందుకు సన్నద్ధమవుతోంది.
దేశంలో జనాభా లెక్కింపు ప్రక్రియ (సెన్సస్) మొదటి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏప్రిల్ 1నుంచి సెప్టెంబర్ 30 వరకు హౌస్ లిస్టింగ్ జరుగుతుందని కేంద్ర హోం శాఖ తెలిపింది. ప్రతి రాష్ట్రానికి 30 రోజుల సమయం ఉంటుందని తెలిపింది. ఈమేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రాసెస్ ప్రారంభానికి 15 రోజుల ముందు స్వీయ గణనకు ఆప్షన్ కూడా ఉంటుందని తెలిపింది. మొదటి విడతలో హౌస్ లిస్టింగ్, గణన 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు ఇక రెండో దశలో జనాభా లెక్కల సేకరణ 2027 ఫిబ్రవరి- మార్చి 1 సమయాల్లో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సారి జనాభా లెక్కింపు డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. మొబైల్ యాప్ ల ద్వారా జనాభా లెక్కల సమాచారాన్ని సేకరిస్తామని, స్వీయ గణనకు ఇదెంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది. ఇక దీంతో పాటుగా కుల గణనను చేపట్టనున్నట్లు తెలుస్తోంది.