తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. ఫిబ్రవరి చివరి వారంలో ఈసా, మూసీ నదుల సంగమ ప్రాంతంలో తలపెట్టిన “గాంధీ సరోవర్ ప్రాజెక్టు” శంకుస్థాపన కార్యక్రమానికి ఆయనను సీఎం రేవంత్ ఆహ్వానించారు. ఈ ప్రాంతానికి ఉన్న ఛారిత్రక నేపథ్యాన్ని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. 1948 ఫిబ్రవరిలో మహాత్ముని చితాభస్మాన్ని ఈసా, మూసీ సంగమ స్థలిలో కలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం తలపెట్టిన మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా “గాంధీ సరోవర్” ప్రాజెక్టు చేపడుతున్నట్లు రాజ్నాథ్ సింగ్ కి తెలియజేశారు. ఈ ప్రాంతంలో ఉన్న బాపుఘాట్ ను భవిష్యత్ లో ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలపనున్నట్లు వివరించారు. సీఎం రేవంత్ తో పాటు ఈ భేటీలో పలువురు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు.