కేంద్ర ప్రభుత్వం ‘gods own country’ గా ప్రసిద్ధి చెందిన కేరళకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మలయాళంలో ఆ రాష్ట్రాన్ని మొదటి నుంచీ ‘కేరళం’ అని పిలుస్తారు. కానీ భారత రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో మాత్రం ‘కేరళ’ అని ఉంది. దీనిని భాషాపరంగా సరిచేయాలన్నది ఆ రాష్ట్ర ప్రజల కోరిక. కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా ‘కేరళం’గా మార్చేందుకు ముందడుగు వేసింది. ఈ మేరకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను ప్రధాని మోడీ నేతృత్వంలో నేడు సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో కేరళ ప్రజల చిరకాల కోరిక సాకారం కానుంది. మలయాళంలో కేరళ రాష్ట్రాన్ని ‘కేరళం’ అనే పిలుస్తారు. స్థానికంగా ఉచ్చరించుకునే విధంగా అధికారిక పేరును కూడా మార్చాలని కోరుతూ ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం 2024 జూన్ 24న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఈ ప్రతిపాదనకు ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కేంద్ర క్యాబినెట్ ఆమోదం తర్వాత ఈ ప్రక్రియ మరో దశకు చేరుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం, రాష్ట్రపతి ‘కేరళ (పేరు మార్పు) బిల్లు, 2026’ను రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం పంపుతారు. అక్కడ ఆమోదం లభించాక, ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాజ్యాంగ సవరణతో పేరు మార్పు అధికారికంగా అమల్లోకి వస్తుంది. ఇదివరకు కూడా 2011లో ఒరిస్సాను ‘ఒడిశా’గా, పాండిచ్చేరిని 2006లో ‘పుదుచ్చేరి’గా మార్చిన తరహాలోనే ఇప్పుడు కేరళ పేరు కూడా ‘కేరళం’ గా మారుతోంది.