వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఈ నెల 23,29న రెండు విడతల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ హడావుడి మొదలైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నామినేషన్ దాఖలు చేశారు. ఆమె పోటీచేస్తున్న భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేశారు. ఖాళీఘాట్ లోని ఆమె నివాసం నుండి అలీపూర్ సర్వే బిల్డింగ్ వరకు ఆమె భారీ ర్యాలీ నిర్వహించారు. ఆమె సపోర్టర్స్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె నామినేషన్ డాక్యుమెంట్స్ సమర్పించారు. తాను పుట్టి పెరిగింది భవానీ పూర్ లోనే అని తన జీవితంలో అంతా ఇక్కడి నుండే మొదలైందని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తమ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించాలని ఆమె కోరారు. SIR లో భాగంగా పలువురు పేర్లను లిస్టు నుండి తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటరు లిస్టులో కొందరి పేర్లను తొలగించడం బాధ కలిగించిందన్నారు. ఓటరు జాబితాను ఇంకా ఎందుకు విడుదల చేయలేదో అర్ధం కావడం లేదని అన్నారు. ఇక భవానీ పూర్ నుండి మమతా బెనర్జీ మూడు సార్లు విజయం సాధించారు. ఇక టీఎంసీకి ప్రధాన ప్రత్యర్థిగా ఈ ఎన్నికల్లో బీజేపీ తలపడనుంది. ఈ రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొని ఉంది. మమతకు ప్రత్యర్థిగా సువేందు అధికారి పోటీచేస్తున్నారు. మే 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.