ఆదాయమార్గం..!!

Spread the love

Siddipet Oil Palm Factory: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన కృషి తో సిద్దిపేట ప్రాంతం ఆయిల్‌పామ్‌ తోటలకు అడ్డాగా మారింది. సిద్దిపేట జిల్లాలో గడిచిన ఐదేండ్లలో వేల ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్‌ తోటలు సాగుచేశారు. తొలి ఏడాది సాగుచేసిన రైతుల పంట చేతికి వచ్చింది. సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామ శివారులో 62 ఎకరాల విస్తీర్ణంలో రూ. 300 కోట్లతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధమైంది.

నర్మెట ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ భవిష్యత్తులో సిద్దిపేటకే కాకుండా జన గాం, మహబూబాబాద్‌, గద్వాల, నారాయణపేట, యాదాద్రి-భువనగిరి తదితర జిల్లాల ఆయిల్‌పామ్‌ గెలలను ప్రాసెస్‌ చేయుటకు అత్యాధునిక సామర్ధ్యంతో మలేషియా టెక్నాలజీతో ఫ్యాక్టరీని నిర్మించారు.కాయల నుంచి వచ్చే పీచుతో పరుపులను తయారుచేస్తారు. వ్యర్ధాలతో చేపలకు ఎరువు, బయోగ్యాస్‌కు ఉపయోగిస్తారు. నర్మెట ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ నిర్మాణంతో ఇక్కడి రైతులకు ప్రయోజనం కలగడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షం గా రెండు వేల మందికి పైగా ఉపాధి కలగనున్నది.

ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటిన తర్వాత నాలుగో ఏడాది నుంచి కాపు మొదలై 30 ఏండ్ల వరకు నిరంతర దిగుబడితో రైతులకు ఆదాయం వస్తుంది.సాంప్రదాయ నూనెగింజల కంటే ఆయిల్‌పామ్‌ నూనె దిగుబడి 5 రెట్ల వరకు అధికంగా వస్తుంది. తెగుళ్లు, చీడపీడల బెడద ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్‌పామ్‌లో చాలా తక్కువ. తుఫాన్‌, వడగండ్ల, వానలు, ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతగా తట్టుకుంటుంది. కోతులు, అడవి పందుల బెడద ఉండదు. ఇతర పంటల మాదిరిగా ధాన్యాన్ని ఆరబెట్టడం, తూర్పార పట్టడం, తేమ శాతం నిలవడం లాంటి సమస్యలు ఆయిల్‌పామ్‌లో ఉండవు.

నర్మెట ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ మనకు ఎమోషన్‌ అని.. ఈ ఫ్యాక్టరీ వేలాది మంది రైతుల జీవితాల్లో గుణాత్మక మార్పును తీసుకువస్తుందన్నారు ఎమ్మెల్యే హరీశ్‌రావు . మనం చాలా ఫాక్టరీలు చూస్తుంటామని.. కానీ, ఇది భిన్నమైందన్నారు. ఈ ప్రాంత రైతుల నవశకానికి ఈ ఫ్యాక్టరీ నాంది అని తెలిపారు. గాలిలో తేమ ఎక్కువ ఉన్న చోటనే పామాయిల్‌ పండుతుందని.. కేసీఆర్‌ కృషితో రాష్ట్రమంతా పామాయిల్‌కు అనుకూలంగా మారిందన్నారు. ఒక్కసారి పంట వేస్తే 30 సంవత్సరాల వరకు రైతుకు ఆదాయం వస్తుందన్న ఆయన.. ఉద్యోగులకు నెల రోజుకు జీతం వస్తే.. పామాయిల్‌ రైతులకు 20 రోజులకే డబ్బులు చేతికి అందుతాయన్నారు.

ఇతర పంటల కంటే ఆయిల్‌పామ్‌ పంట సాగు అన్నివిధాలా భాగుంటుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. మూడెకరాల్లో ఆయిల్‌పామ్‌ తోటను పెట్టాను. పంటలు వేసుకోవడంతో ఆదాయం వచ్చింది. ఆయిల్‌పామ్‌ పంట చేతికి రావడంతో ఎకరాకు రూ.2 లక్షల వరకు డబ్బులు చేతికి వచ్చాయన్నారు. మొత్తం 3 ఎకరాల్లో కలిపి రూ.6 లక్షల ఆదాయం వచ్చింది.ఈ పంటకు కొతుల బెడద లేదు. Siddipet Oil Palm Factory.

దళారీ వ్యవస్థ ఉండదు. రైతు గెలలు కోసిన తర్వాత నేరుగా ఫ్యాక్టరీకి తరలించి మూడు రోజుల్లో గెలలు, రవాణా చార్జీలు పొందే అవకాశం ఉంటుంది.ఆయిల్‌ పామ్‌ సాగుతో నిరంతర దిగుబడి, ఆదాయంతో రైతుల ఆర్థిక పురోగతికి దోహదం చేయనున్నది. ఇతర పంటలతో పొలిస్తే ఖర్చుల పోను ఆయిల్‌పామ్‌ సాగుతో ఏడాదికి ఎకరాకు నికరంగా రూ.1,00, 000లు ఆదాయం మిగులుతుంది. మొదటి మూడేండ్లు ఆదాయం కోసం అంతర పంటలుగా కూరగాయలు, మొక్కజొన్న ,పత్తి , బెబ్బర్లు, పెసర్లు, కందులు, ఉలువలు పొద్దుతిరుగుడు, అరటి, బొప్పాయి, వేరుశనగ లాంటి పంటలు పండించవచ్చు. ఐదేండ్ల తర్వాత కోకో, పొట్టి మిరియాలు మొదలగు పంటలను ఆయిల్‌పామ్‌ తోటల్లో అంతర పంటలుగా సాగుచేసి అదనపు ఆదాయం పొందవచ్చు.