ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలీసా హీలీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. భారత్ తో సిరీస్ తర్వాత తాను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు వెల్లడించింది. తన నిర్ణయాన్ని ఆమె తాజాగా ఒక పాడ్కాస్ట్ లో వెల్లడించింది. తనకు మరికొంతకాలం ఆస్ట్రేలియా తరపున ఆడాలని ఉన్నప్పటికీ పోటీతత్వం కోల్పోవడం వల్ల తానీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. రానున్న భారత సిరీస్ లో నేను చివరిసారిగా ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ కనిపిస్తాను. నాకు ఇప్పటికీ ఆస్ట్రేలియా తరపున ఆడాలని ఉంది. కానీ ప్రారంభం నుంచీ నన్ను ముందుకు నడిపించిన పోటీతత్వాన్ని నేను కొంత కోల్పోయాను. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని తెలిపింది. నేను టీ20 జట్టులో లేను. కాబట్టి భారత్తో టీ20 సిరీస్ లో నేను ఆడటం లేదు. కానీ.. నేను నా కెరీర్ ను టెస్ట్, వన్డే కెప్టెన్ గా స్వదేశంలో భారత్ తో ఆడుతూ ముగిస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపింది. ఈ క్యాలెండర్ లో మాకు ఇది పెద్ద సిరీస్ అని ఆమె అన్నారు. ఫిబ్రవరి 15 నుంచి భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో 3 టీ 20, 3 వన్డేలు, పెర్త్ వేదికగా 1 టెస్ట్ మ్యాచ్ ఆడనుంది.