భారత్-శ్రీలంకలు ఆతిథ్యం ఇవ్వనున్నటీ 20 వరల్డ్ కప్ కోసం భారత్ కు తమ జట్టును పంపడం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) ఐసీసీకి తెలిపిన విషయం విదితమే. రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తాము భారత్ లో వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడలేమని, తమ జట్టు ఆడే మ్యాచ్ లు మరోచోట నిర్వహించాలని బీసీబీ ఐసీసీని కోరిన విషయం తెలిసిందే. బీసీసీఐ ఆదేశాలతో ముస్తాఫిజుర్ రెహమాన్ ను రిలీజ్ చేస్తూ.. కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీసీబీ వరల్డ్ కప్ ఆడేందుకు తమ జట్టును భారత్ కు పంపించమని చెబుతోంది. తమ క్రికెట్ బోర్డులోని సభ్యులందరితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకోబోయే ముందు రెండు సమావేశాలు నిర్వహించినట్లు ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లా క్రికెట్ జట్టును వరల్డ్ కప్ ఆడటానికి భారత్ కు పంపడం సురక్షితం కాదని భావిస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లామ్ తెలిపారు. ఈ విషయమై ఐసీసీకి మెయిల్ పంపినట్లు పేర్కొన్నారు. మాకు భద్రత చాలా ముఖ్యం. ఐసీసీతో మాకు త్వరలోనే సమావేశం ఉంటుందని భావిస్తున్నాం. మా తర్వాతి కార్యాచరణ ఐసీసీ రెస్పాన్స్ ను బట్టి ఉంటుందని పేర్కొన్నారు. మేం ఈ విషయంలో బీసీసీఐతో సమాచారాన్ని పంచుకోవడం లేదు. ఎందుకంటే ప్రపంచకప్ కప్ అనేది ఐసీసీ ఈవెంట్ కాబట్టి దానికే కమ్యూనికేట్ చేస్తున్నామని తెలిపారు.