హైదరాబాద్ ను ప్రపంచానికి గేట్ వే గా మార్చే నగరం ప్రజా ప్రభుత్వం నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేట్ లో తాజాగా “ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్” నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రజల సహకారం, రైతుల త్యాగాలతో అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తామన్నారు. నూతన నగర నిర్మాణంలో నష్టపోతున్న ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తనదని సీఎం భరోసానిచ్చారు. సామాన్యులు, పేదల విషయంలో అధికారులు మానవీయ కోణంలో ఆలోచన చేయాలన్నారు. ఇక ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు మల్కాజ్ గిరి కమిషనరేట్ భవనం, OCTOPUS అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కుత్బుల్లాపూర్ DCP కార్యాలయ భవనాలను ప్రారంభించారు. గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, డి. శ్రీధర్ బాబు, శాసన మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, అనీల్ కుమార్ యాదవ్, శాసన సభ్యుడు మల్ రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.