యూరియా యాప్ను రద్దు చేసి, పాత విధానంలో, ఎలాంటి షరతుల్లేకుండా రైతులకు యూరియా సరఫరా చేయాలని తెలంగాణ రైతాంగం పక్షాన బీ.ఆర్.ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.షాపుల్లో అమ్మాల్సిన యూరియాను, యాపుల్లో ఇస్తామని ఆర్భాటం చేసిన రేవంత్ రెడ్డి.. ఈ రైతు ఆక్రందన మీకు వినిపిస్తుందా? అని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. గుండెలు మండి మీ ప్రభుత్వంపై తిరగబడుతున్న అన్నదాత రోధన మీకు అర్థమవుతుందా?ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరిదీ ఇదే పరిస్థితని యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టే ఆనాటి రోజులు తేవడమేనా మీరు చెప్పిన మార్పు? అని రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు. నిరక్షరాస్యులు, స్మార్ట్ ఫోన్ లేని లక్షలాది మంది రైతులు ఏ విధంగా యాప్ ను వినియోగిస్తారన్న కనీస సోయి కూడా మీ ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల ఇంత కర్కషంగా, కఠినంగా వ్యవహరిస్తున్న తీరును యావత్ తెలంగాణ సమాజం గమనిస్తున్నదన్నారు. లేదంటే యూరియా కష్టాలు భరించని రైతులు మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ ను ముట్టడించే రోజులు వస్తాయని హెచ్చరించారు.