ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిఉంటే సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సభ్యుడిగా పోటీకి అనర్హులన్న నిబంధనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. పోటీ చేయడానికి, పదవుల్లో కొనసాగేందుకు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా అర్హులే అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ రైతుల నీటిపారుదల వ్యవస్థల యాజమాన్య(సవరణ) బిల్లును అసెంబ్లీ తాజాగా ఆమోదించింది. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. 1980-90 మధ్యకాలంలో జనాభా విస్ఫోటం జాతీయ ఆహారభద్రతపై తీవ్ర ప్రభావం చూపింది. జనాభాను నియంత్రించేందుకు అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాయని ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలుంటే సాగునీటి సంఘాల ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న రూల్ తెచ్చారని తెలిపారు. అయితే కొన్ని సంవత్సరాల నుండి గ్రామీణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి పడిపోయిందని భవిష్యత్తు తరాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోనూ సంతానోత్పత్తిపై నియంత్రణను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు.