గుంటూరు సమీపంలోని అమరావతి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ వేదికగా ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో జరుగుతున్న ‘3వ ప్రపంచ తెలుగు మహాసభలు’ ఘనంగా జరుగుతున్నాయి. కాగా, ఈ సభల ప్రారంభోత్సవంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు అంటే కేవలం భాష కాదని అది మన జీవన విధానం, మన సంస్కృతి అని అన్నారు. అమ్మ పాడే లాలిపాటలో, చెప్పే కథల్లో తెలుగు మాధుర్యం దాగి ఉందని .. పల్లెల్లో సంక్రాంతి, దసరా, ఉగాది పండుగల వాతావరణం కనుమరుగవుతుండటం బాధాకరమని పేర్కొన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన,మహనీయుడు ఎన్టీఆర్ ను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం తరఫున తెలుగు భాషాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ మహాసభల్లో మేధావులు చేసే తీర్మానాలను తనకు పంపాలని, ఆ తీర్మానాలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి, చర్చించి, ప్రభుత్వం ద్వారా అమలు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సత్యసాయి బాబా సన్నిధిలో, ఎన్టీఆర్ కళావేదికపై మాట్లాడటం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు.