ఏఐ వలన ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనలను పక్కన పెట్టాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పిలుపునిచ్చారు. ‘లుకింగ్ ఎహెడ్ 2026’ పేరుతో ఆయన రాసిన తాజా బ్లాగ్లో ఏఐ భవిష్యత్తుపై కీలక విశ్లేషణ చేశారు.ఏఐ అనేది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాదని,అది మానవ సామర్థ్యాలను రెట్టింపు చేసే ఒక శక్తివంతమైన సాధనమని ఆయన స్పష్టం చేశారు.దశాబ్దాలుగా విండోస్, ఆఫీస్ సాఫ్ట్వేర్లు అందించిన సేవల స్థానంలో ఇప్పుడు మరింత శక్తివంతమైన ‘ఏఐ ఏజెంట్లు’ రానున్నాయని ఆయన వెల్లడించారు.ఏఐ పరిశ్రమ కేవలం కొత్తదనపు దశను దాటి, ఇప్పుడు వాస్తవ ప్రపంచంలోని సమస్యలను పరిష్కరించే కీలక దశలోకి ప్రవేశించిందని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ఏఐని ఒక భాగం చేసుకోవడం ద్వారా లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని, ఇందుకోసం మైక్రోసాఫ్ట్ తన ‘కోపైలట్’ వంటి ఉత్పత్తులను మరింత ఆధునీకరిస్తూ భారీగా పెట్టుబడులు పెడుతోందని నాదెళ్ల వివరించారు.