ఉగ్రవాదం విషయంలో భారత్ నేడు ‘జీరో టాలరెన్స్’ విధానంతో ముందుకు వెళ్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సరిహద్దు దాటి వచ్చి సమస్య సృష్టిస్తే, వారి భూభాగంలోకి వెళ్లి మరీ బుద్ధి చెప్పే సత్తా మనకుందని సర్జికల్ స్ట్రైక్స్ , ఆపరేషన్ సింధూర్ నిరూపించాయని పేర్కొన్నారు. “వసుధైక కుటుంబకమ్” అనే మన సంస్కృతిని కాపాడుకుంటూ, ఉగ్రవాద రహిత ప్రపంచం కోసం అందరం కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. భారత పార్లమెంటుపై దాడి జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అమర జవాన్లకు నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులను స్మరించుకోవడానికి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఇతర మిత్రులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా మంచి విషయమని ప్రశంసించారు. “Terrorism has no religion, no region, and no reason” – ఉగ్రవాదం మానవజాతికే శత్రువని స్పష్టం చేశారు. ఆనాడు కమలేష్ కుమారి గారు, ఇతర భద్రతా సిబ్బంది చూపిన అసాధారణ పరాక్రమం మన ప్రజాస్వామ్య సౌధాన్ని కాపాడిందని గుర్తుచేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలపై అంతర్జాతీయ సమాజం కఠినంగా వ్యవహరించాలన్నారు. అభివృద్ధికి శాంతియే పునాది. యువత విచ్ఛిన్నకర శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.