‘ప్యాక్స్ సిలికా’లో భాగస్వామిగా భారత్ కూడా చేరింది. ప్యాక్స్ సిలికా అనేది గ్లోబల్ టెక్నాలజీ రంగంలో సెమీకండక్టర్ (చిప్స్) తయారీని వేగవంతం చేయడానికి ఏర్పడిన ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం. ముఖ్యంగా, తదుపరి తరం ఎలక్ట్రానిక్స్ కోసం సిలికా (Silica) మరియు సిలికాన్-ఆధారిత సాంకేతికతలను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో జరిగిన ఒక కార్యక్రమంలో సంబంధిత ఒప్పందంపై భారత్ సంతకాలు చేసింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, అమెరికా ఆర్థిక వ్యవహారాల ఉప మంత్రి జాకబ్ హెల్ బర్గ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్ చేరడం ఈ కూటమికి బలాన్ని ఇచ్చిందని అమెరికా రాయబారి సెర్గియో గోర్ అన్నారు. మేము కేవలం ఏఐపై సదస్సు నిర్వహించడం లేదు.భవిష్యత్తును నిర్మిస్తున్నామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. సెమీకండక్టర్ల సెక్టార్ లో భారత్ సామర్థ్యం పెరిగిందని పేర్కొన్నారు.